ఏం చేద్దాం? ఎలా చెక్ పెడదాం? కీలక అంశాలపై ‘బండి’ రివ్యూ

by Disha Web Desk 4 |
ఏం చేద్దాం? ఎలా చెక్ పెడదాం? కీలక అంశాలపై ‘బండి’ రివ్యూ
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు శ్రమిస్తున్న బీజేపీకి మోడీ సభతో మరింత జోష్ పెరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వానికి చెక్ పెట్టి కాషాయ జెండా రెపరెపలాడించాలంటే ఎలా ముందుకు వెళ్లాలనే అంశాలపై కాషాయదళం ప్రణాళికలు వేసుకుంటోంది. అధికారంలోకి వచ్చేందుకు నేతలంతా కలిసికట్టుగా పనిచేయాలని ఇప్పటికే రాష్ట్ర నాయకత్వం దిశానిర్దేశం చేసింది.

ఇటీవల అన్ని మోర్చాల అధ్యక్షులకు కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి తరుణ్ చుగ్ దిశానిర్దేశం చేశారు. ఎన్నికలకు సమయం తక్కువగా ఉందని, ఇప్పటికైనా స్పీడ్ పెంచకుంటే అధికారంలోకి రావడం కష్టమని వారిలో ఉత్సాహాన్ని నింపారు. తాజాగా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బండి సంజయ్ నేతలతో వరుస రివ్యూలు నిర్వహించారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. నాంపల్లి బీజేపీ కార్యాలయంలో బండి తొలుత టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ అంశానికి సంబంధించి బీజేపీ ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యులతో భేటీ అయ్యారు.

సర్కారు ఎదుట మూడు డిమాండ్లు..

నిరుద్యోగుల సమస్యలు తెలుసుకోవడం ఎంతవరకు వచ్చిందనే అంశాలపై ఆరా తీశారు. నిరుద్యోగుల్లో ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత ఉందని తెలుసుకున్నారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన ప్రతి తప్పును ప్రశ్నించేది, అన్ని అంశాలపై పోరాడుతున్న పార్టీ బీజేపీయేనని వివరిస్తున్నారా? లేదా? అనేది అడిగారు. అంతేకాకుండా పేపర్ లీకేజీపై ఇప్పటికే బండి సంజయ్ ప్రభుత్వంపై మూడు డిమాండ్లు ఉంచారు. లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ, మంత్రి కేటీఆర్‌ను పదవి నుంచి బర్తరఫ్ చేయడంతో పాటు నష్టపోయిన నిరుద్యోగులకు రూ.లక్ష ఆర్థికసాయం అందజేయాలన్నారు.

నిరుద్యోగ మార్చ్ ప్లాన్..

టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యులతో భేటీ అనంతరం నిరుద్యోగ మార్చ్ కమిటీ సభ్యులతో బండి సంజయ్ భేటీ అయ్యారు. ఉమ్మడి వరంగల్ నుంచే ఈ మార్చ్‌కు సమరశంఖం పూరించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆపై అన్ని జిల్లాల​వారీగా దీన్ని ఇంప్లిమెంట్ చేసి మిలియన్ మార్చ్ తరహాలో నిరుద్యోగ మిలియన్ మార్చ్ చేపట్టాలని డిసైడయ్యారు. దీన్ని సక్సెస్ చేసేందుకు అన్ని కోచింగ్ సెంటర్లు, కాలేజీలు, వర్సిటీలకు వెళ్లనున్నారు. ఈ ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభం కానుంది.

లీగల్ టీంతో చర్చ..?

అనంతరం లీగల్ టీంతో సమీక్ష జరిపిన సంజయ్ లీకేజీ అంశాలపై ఎలా ముందుకు వెళ్తే బాగుంటుందనే అంశాలను ప్రస్తావించారు. చర్చలోకి వచ్చిన అంశాలకనుగుణంగా తదుపరి కార్యాచరణను రూపొందించుకోనున్నారు. ఇదిలా ఉండగా ఈ రివ్యూలో ప్రధాని సభ, నరేంద్రమోదీ కామెంట్స్‌పైనా బీఆర్ఎస్ నేతలు, ప్రజలు ఏం చర్చించుంటున్నారనే అంశాలపైనా బండి ఆరా తీశారు. మోడీపై బీఆర్ఎస్ చేసిన విమర్శలు, సంజయ్ ఇచ్చిన కౌంటర్ సైతం చర్చలోకి వచ్చింది.

Next Story

Most Viewed